• Login / Register
  • క్రీడలు

    నేనే ధోని అయితే తప్పుకునే వాడిని

    నేనే ధోని అయితే తప్పుకునే వాడిని

    సంజయ్‌ బంగర్‌

    స్పోర్ట్స్ డెస్క్‌: తానే ధోని  అయితే.. ఇప్పటికే ఐపీఎల్‌  నుంచి తప్పుకొని ఉండేవాడినని టీమ్‌ఇండియా  మాజీ క్రికెటర్‌ సంజయ్‌ బంగర్‌  అన్నాడు. గత కొన్నేళ్లుగా ఐపీఎల్‌ నుంచి ధోని రిటైర్‌మెంట్‌పై వార్తలు వస్తూనే ఉన్నాయి. రానున్న 2026 సీజన్‌లో తాను ఐపీఎల్‌ ఆడేది, లేనిదీ ఇంకా ఏ విషయమూ ధోని తేల్చి చెప్పలేదు. తానే ధోని స్థానంలో ఉంటే తగినంత క్రికెట్‌ ఆడి, ఫ్రాంఛైజీ ప్రయోజనాలు చూసుకున్న తర్వాత ఓ రోజు రిటైర్‌మెంట్‌ నిర్ణయం తీసుకుంటానని సంజయ్‌ బంగర్‌ అన్నాడు. అలాగే ధోని తన పర్యవేక్షణలోనే చెన్నై జట్టు పురోగతి సాధిస్తుందని భావిస్తుంటే వీడ్కోలు పలకడానికి అసలు సరైన సమయమే ఉండదని టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ తన అభిప్రాయం వ్యక్తంచేశాడు. తాను లేకపోయినా చెన్నై జట్టు దానంతట అదే ముందుకుసాగుతుందనే వాస్తవాన్ని ఎంఎస్‌ ధోని అంగీకరించాల్సి ఉంటుందన్నాడు.  

    ‘రిటైర్‌మెంట్‌ అనేది ఎంఎస్‌ ధోని నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. నేనే ధోని అయితే మాత్రం క్రికెట్‌ ఆడింది ఇక చాలని భావిస్తా. ప్రాంఛైజీ ప్రయోజనాలు కూడా నెరవేర్చాను కాబట్టి ఆటకు వీడ్కోలు చెబుతా’ అని సంజయ్‌ బంగర్‌ అన్నాడు. ‘జట్టులో మార్పు అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి రిటైర్‌మెంట్‌ తీసుకోవడానికి అనువైన సమయం అంటూ ఏదీ ఉండదు. తాను నిష్క్రమించినా ఫ్రాంఛైజీ అభివృద్ధి దానంతట అదే జరుగుతుందనే వాస్తవాన్ని గ్రహించాలి’ అని సంజయ్‌ బంగర్‌ విశ్లేషించాడు.

    ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ ప్రదర్శన సరిగా లేదు. 13 మ్యాచ్‌లు ఆడిన ధోని కూడా 135.17 స్ట్రైక్‌రేట్‌తో కేవలం 196 పరుగులు మాత్రమే చేశాడు. చాలాసార్లు ధోని లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఓ మ్యాచ్‌లో అయితే ఏకంగా తొమ్మిదో స్థానంలో బరిలోకి దిగాడు. మే 25న అహ్మదాబాద్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో  జరగనున్న మ్యాచ్‌ ఈ సీజన్‌లో చెన్నైకి చివరిది.

    Leave A Comment