• Login / Register
  • క్రీడలు

    ఆంధ్ర జట్టుకు మారిన సీనియర్‌ రంజీ ప్లేయర్‌

    స్పోర్ట్స్ డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్‌ సీనియర్‌ ఆల్‌రౌండర్‌ సౌరభ్‌ కుమార్‌ వచ్చే రంజీ సీజన్‌ 2025-26 కోసం ఆంధ్రప్రదేశ్‌ జట్టుకు మారాడు. ఈ మేరకు ఇరు జట్లకు సంబంధించిన అన్ని లాంఛనాలు పూర్తయ్యాయి. బీసీసీఐ అప్రూవల్‌ రావడమే తరువాయి. 32 ఏళ్ల సౌరభ్‌ కుమార్‌ 2014లో సర్వీసస్‌ తరఫున ఫస్ట్‌క్లాస్‌ అరంగేట్రం చేసి దశాబ్ద కాలానికి పైగా ఉత్తర్‌ప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహించాడు.
    లెఫ్ట్‌ ఆర్మ్‌ ఆఫ్‌ స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన సౌరభ్‌.. ఇప్పటివరకు 79 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి 25 ఐదు వికెట్ల ప్రదర్శనల సాయంతో 324 వికెట్లు తీశాడు. లోయర్‌ ఆర్డర్‌లో మంచి బ్యాటర్‌ కూడా అయిన సౌరభ్‌ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 2 సెంచరీలు, 15 హాఫ్‌ సెంచరీల సాయంతో 2374 పరుగులు చేశాడు.

    లిస్ట్‌-ఏ ఫార్మాట్‌లో 2015లో అరంగేట్రం చేసిన సౌరభ్‌ ఇప్పటివరకు 40 మ్యాచ్‌లు ఆడి 52 వికెట్లు తీశాడు. ఓ హాఫ్‌ సెంచరీ సాయంతో 340 పరుగులు చేశాడు. 2016లో టీ20 అరంగేట్రం చేసిన సౌరభ్‌.. 33 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు తీసి 148 పరుగులు చేశాడు. 

    సౌరభ్‌ 2017 ఐపీఎల్‌ సీజన్‌లో ధోని నేతృత్వంలోని రైజింగ్‌ పూణే సూపర్‌ జెయింట్స్‌కు ఎంపికయ్యాడు. అయితే అతనికి ఐపీఎల్‌లో ఒక్క మ్యాచ్‌ ఆడే అవకాశం కూడా రాలేదు. 2021 సీజన్‌లో సౌరభ్‌ను పంజాబ్‌ కింగ్స్‌ ఎంపిక చేసుకుంది. ఆ సీజన్‌లోనూ అదే పరిస్థితి. 

    2022 ఫిబ్రవరిలో సౌరభ్‌కు భారత టెస్ట్‌ జట్టులో చోటు దక్కింది. శ్రీలంకతో జరిగిన ఆ సిరీస్‌లో సౌరభ్‌ నెట్‌ బౌలర్‌గా సేవలందించాడు. ఇటీవలికాలంలో సౌరభ్‌ ఇంగ్లండ్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక సిరీస్‌లకు కూడా నెట్‌ బౌలర్‌గా ఎంపికయ్యాడు. బీసీసీఐ అధికారిక అనుమతి లభించాక సౌరభ్‌ రికీ భుయ్‌, హనుమ విహారి, కేఎస్‌ భరత్‌లతో కలిసి ఆంధ్ర జట్టుకు ఆడతాడు.

    Leave A Comment