• Login / Register
  • హోమ్

    50 మంది ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు యత్నం

     50 మంది ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు యత్నం
     
    దిల్లీ:  ఆపరేషన్‌ సిందూర్‌ వేళ భారీ సంఖ్యలో ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు కుట్ర పన్నారు. ఈ ప్రయత్నాలను బీఎస్‌ఎఫ్‌ తిప్పికొట్టింది. ఆపరేషన్‌ సిందూర్‌ జోరుగా జరుగుతున్న వేళ పెద్ద సంఖ్యలో ఉగ్రమూకను భారత్‌లోకి పంపేందుకు పాక్‌ యత్నించింది. ఈ విషయాన్ని బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ ధ్రువీకరించింది. మే 8వ తేదీన 45 నుంచి 50 మంది ఉగ్రవాదులను సరిహద్దులు దాటించి భారత్‌లోకి పంపించేందుకు పాక్‌ దళాలు తీవ్రంగా యత్నించాయి. ఇందుకోసం భారీగా షెల్లింగ్‌ కూడా చేపట్టినట్లు పేర్కొన్నాయి.  బీఎస్‌ఎఫ్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఎస్‌ఎస్‌ మండ్‌ ఓ ఆంగ్ల వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘మా జవాన్లు వారికి తీవ్ర స్థాయిలో నష్టం కలిగించారు. పెద్ద ఎత్తున ఉగ్రవాదులు సరిహద్దులు దాటేందుకు వస్తున్నట్లు మా వద్ద ముందే సమాచారం ఉంది. వారి కోసం కాచుకు కూర్చొని.. గుర్తించగానే దాడులు నిర్వహించాము. ఆ గ్రూపులో దాదాపు 45-50 మంది వరకు ఉన్నారు. వారు మా వైపునకు వచ్చారు. దీంతో అదును చూసి వారిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాము.  
    మేము ఊహించినట్లే తమ పోస్టుల నుంచి వారు భారీ స్థాయిలో కాల్పులు మొదలుపెట్టారు. ఈ క్రమంలో మేము అత్యంత కచ్చితత్వంతో కాల్పులు జరిపాము. దీంతో వారు తమ పోస్టులను వదిలేసి పలాయనం చిత్తగించారు. దాదాపు గంటన్నరలోనే వారికి మేము బుద్ధి చెప్పాము. వారి బంకర్లు, ఆయుధాలను ధ్వంసం చేశాము. వారు మరోసారి వస్తే పదింతల శక్తితో తిప్పికొట్టేందుకు మా జవాన్లు సిద్ధంగా ఉన్నారు. ఇందుకు సంబంధించి బీఎస్‌ఎఫ్‌కు స్పష్టమైన ఆదేశాలున్నాయి. బీఎస్‌ఎఫ్‌లోని మహిళా జవాన్లు కూడా పురుషులతో సమానంగా శత్రువులపై పోరాడే బాధ్యతలను నిర్వహించారు. వారిని చూస్తే మాకు గర్వంగా ఉంది’’ అని డీఐజీ వెల్లడిరచారు.  బుధవారం పూంచ్‌లోని బ్రిగేడ్‌ హెడ్‌క్వార్టర్‌ను జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్మీ, బీఎస్‌ఎఫ్‌ సిబ్బందితో ఆయన భేటీ అయ్యారు.

    Leave A Comment