• Login / Register
  • హోమ్

    విశాఖ డిప్యూటీ మేయర్‌ పీఠం కూటమి వశం

    విశాఖ డిప్యూటీ మేయర్‌ పీఠం 
     కూటమి వశం

    జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
     
    విశాఖపట్నం, విశాఖ సమాచారం: 
      మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌గా   కార్పొరేటర్‌ దల్లి గోవింద రెడ్డి ఎన్నికయ్యారని విశాఖ జాయింట్‌ కలెక్టర్‌, అదనపు మెజిస్ట్రేట్‌, ఎన్నికల ప్రెసైడిరగ్‌ అధికారి మయూర్‌ అశోక్‌ ప్రకటించారు.  రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ ప్రకారం  మంగళవారం ఉదయం 11 గంటలకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్‌ సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి జీవీఎంసీ  డిప్యూటీ మేయర్‌ ఎన్నిక నిర్వహించామన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకారం  మే 19న డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు   జీవీఎంసి కౌన్సిల్‌ సమావేశ మందిరంలో సభ్యులు సమావేశం అయినప్పటికీ కోరమ్‌ లేకపోవడంతో ఎన్నిక మే 20కి  వాయిదా వేశామని  ప్రెసైడిరగ్‌ అధికారి తెలిపారు. మంగళవారం నిర్వహించిన  ప్రత్యేక సమావేశంలో డిప్యూటీ మేయర్‌ గా దల్లి గోవిందరెడ్డి ఎన్నికయ్యారని తెలిపారు. జనసేనకు చెందిన  గోవిందరెడ్డిని డిప్యూటీ మేయర్‌ అభ్యర్ధిగా  పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యుడు పి.జి.వి.ఆర్‌ నాయుడు (గణబాబు) ప్రతిపాదించగా, ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యుడు విష్ణుకుమార్‌ రాజు బలపరిచారని, ఎక్స్‌ అఫీషియో సభ్యులు, కార్పొరేటర్లు మొత్తం 59 మంది హాజరయ్యారన్నారు. డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు కోరం సరిపోవడం, మరో అభ్యర్థి పోటీలో లేనందున  గోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల ప్రెసైడిరగ్‌ అధికారి మయూర్‌ అశోక్‌ ప్రకటించారు. అనంతరం డిప్యూటీ మేయరుగా   గోవిందరెడ్డితో   ప్రమాణా స్వీకారం చేయించారు. గత ఎన్నికల్లో జనసేన తరపున 62 వ వార్డు నుంచి   గోవిందరెడ్డి విజయం సాధించారు. ఈ సందర్బంగా కూటమి శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, కొణతాల రామక్రిష్ణ, వెలగపూడి రామకృష్ణబాబు, వంశీ క్రిష్ణ శ్రీనివాస్‌ యాదవ్‌, విష్ణుకుమార్‌ రాజు, పంచకర్ల రమేష్‌ బాబు, పి.గణబాబు, గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, కార్పొరేటర్లు, అన్ని పార్టీల ఫ్లోర్‌ లీడర్లు, అధికారులు, సిబ్బంది నూతన డిప్యూటీ మేయర్‌కు పుష్ప గుచ్చాలు అందించి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
      ఈ ఎన్నికకు కూటమి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు హాజరయ్యారు.   జీవీఎంసీ మేయర్‌ పదవి ఇప్పటికే తెలుగుదేశం చేపట్టింది. దీంతో డిప్యూటీ మేయర్‌ పదవిని జనసేనకు కేటాయించారు. వైసీపీ డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌పై కూటమి కార్పొరేటర్లు ఇటీవల అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డిప్యూటీ మేయర్‌ ఎన్నిక తప్పనిసరిగా మారింది.

    Leave A Comment