పర్యావరణ సమతుల్యత పాటిస్తూనే పారిశ్రామికాభివృద్ధి
విశాఖపట్టణం, విశాఖ సమాచారం: పర్యావరణ పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూనే పారిశ్రామికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నామని, ఆ దిశగా అందరికీ ఆమోదయోగ్యమైన ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ముందుకు సాగుతున్నామని, పర్యావరణ సమతుల్యత పాటిస్తున్నామని రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఈ, సెర్ప్, ఎన్.ఆర్.ఐ. శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సీఐఐ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విశాఖపట్టణం నోవాటెల్ హోటళ్లో శుక్రవారం జరిగిన సస్టైనబిలిటీ సమ్మిట్ - 2025లో ముఖ్య అతిథిగా భాగస్వామ్యమయ్యారు. పర్యావరణ పరిరక్షణకు, పచ్చదనం పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్దేశాల మేరకు స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర సాధనలో కీలకంగా వ్యవహరిస్తున్నామని, దానికి అనుగుణంగా ప్రతి మూడో శనివారం పరిసరాల పరిశుభ్రతను చేపడుతున్నామని వివరించారు. క్లీన్ అండ్ గ్రీన్ ఆంధ్రప్రదేశ ఆవిర్భావానికి అడుగులు వేస్తున్నామని, వాతావరణ సమతుల్యతను పాటిస్తూ అభివృద్ధి ప్రాజెక్టులు చేపడుతున్నామని ఉద్ఘాటించారు. దానిలో భాగంగానే 4.0 ఎంఎస్ఎంఈ పాలసీని రూపొందించామని, ఒన్ ఫ్యామిలీ ఒన్ ఎంటర్ప్రెన్యూర్ కాన్సెప్ట్ కు ప్రాధాన్యత ఇస్తూ తగిన సహాయ, సహకారాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో గ్రీన్ ఫీల్డ్ ఎంఎస్ఎంఈ పార్కులను నెలకొల్పుతున్నామని మంత్రి గుర్తు చేశారు. సోలార్, పంప్డ్ ఎనర్జీ, బయో ఇంధన వనరులతో కూడిన 20 గిగా వాట్ల విద్యుత్ ఇంధన వనరుల ఉత్పత్తికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని, ప్రత్యేక ప్రాజెక్టుల రూపకల్పనలో కార్యసాధనలోకి పేర్కొన్నారు. సర్య్కులర్ ఎకానమీ, సస్టైనబిలిటీ డెవలప్మెంట్, పర్యావరణ హిత తదితర ఉద్దేశాలకు ప్రాధాన్యత ఇస్తూ స్వర్ణాంధ్ర @ 2047 సాధనకు అవిరళ కృషి చేస్తామని మంత్రి ఉద్ఘాటించారు.
విశిష్ట నగరం విశాఖ: కలెక్టర్
విశాఖపట్టణం ఎన్నో విశిష్టతలు కలిగి ఉన్న నగరమని, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధికి ఇదొక చోదక శక్తి అని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అభివర్ణించారు. రాష్ట్రంలోనే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థలో, జీడీపీ రేషియోలో కూడా విశాఖపట్టణం కీలకపాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. సువిశాలమైన తీరం, ఉత్పాదకత కలిగిన మావన వనరులు ఉన్నాయని గుర్తు చేశారు. పారిశ్రామిక అభివృద్ధికి, పాలసీలకు అనుగుణంగా జిల్లాలో చర్యలు చేపడుతున్నామని చెప్పారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నీటి సంరక్షణ చర్యలు చేపడుతున్నామని, ధాన్ ఫౌండేషన్ సహాయంతో ఇప్పటికే పలు పనులు చేశామని గుర్తు చేశారు. తీర ప్రాంత రక్షణకు, అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంటుకు తగిన చర్యలు చేపడుతున్నామని, సుమారు రూ.200 కోట్లతో వివిధ ప్రాజెక్టులు చేపడుతున్నట్లు వివరించారు. ఇప్పటికే ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ను నెలకొల్పామని తెలిపారు. లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంటుకు ప్రాధాన్యత ఇస్తున్నామని, గ్రీన్ విశాఖ మిషన్ లో భాగంగా మిలియన్ మొక్కులు నాటేందుకు కార్యాచరణ రూపొందించామని, గ్రీన్ కవరేజ్ 28 నుంచి 33 శాతానికి తీసుకెళ్తామని కలెక్టర్ పేర్కొన్నారు. పచ్చదనం పెంపులో పాఠశాల విద్యార్థులను భాగస్వామ్యం చేస్తామని, ప్రతి ఒక్కరి చేతా మొక్కలు నాటిస్తామని చెప్పారు. దీనిలో పోర్టు, హెచ్పీసీఎల్, ఇతర స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటున్నామని గుర్తు చేశారు. రానున్న మూడు నాలుగు సంవత్సరాల్లో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయని అన్నారు.
కార్యక్రమంలో సీఐఐ ప్రతినిధులు గన్నమనేని మురళీ కృష్ణ, ఎస్. నరేంద్ర కుమార్, డా. పి. రాంబాబు, థాకూర్ ఎస్. పెర్వానీ, నారాయణరాజు తదిరులు పాల్గొన్నారు.
Leave A Comment