ప్రైవేటు స్కూల్స్లో ప్రవేశాలకు లాటరీ ఫలితాలు వెల్లడి
ప్రైవేటు స్కూల్స్లో ప్రవేశాలకు లాటరీ ఫలితాలు వెల్లడి
అమరావతి, విశాఖ సమాచారం: ఏపీలో ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ) కింద ప్రైవేటు పాఠశాలల్లో 25శాతం ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి గుడ్న్యూస్. ఈ ప్రవేశాలకు సంబంధించి తొలి విడత లాటరీ ఫలితాలు విడుదల చేసినట్లు సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఒకటో తరగతిలో ప్రవేశాలకు మే 2 నుంచి 19వరకు దరఖాస్తులు స్వీకరించగా.. మొత్తం 37,427మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 28,882 మంది పాఠశాలలను ఎంచుకోగా.. 28,561 మంది అర్హత సాధించారు. అయితే, ఇందులో తొలి విడత లాటరీలో 23,117 మందికి సీట్లు కేటాయించారు.
సీట్ల కేటాయింపు వివరాలను తల్లిదండ్రులకు నేరుగా ఫోన్లకు పంపిన అధికారులు.. తాజాగా తొలి విడత లాటరీకి ఎంపికైన వారి వివరాలతో ప్రత్యేక జాబితాను విడుదల చేశారు. ఎంపికైన విద్యార్థుల జిల్లా పేరు, మండలం, అప్లికేషన్ ఐడీ, పేరు, తండ్రి/సంరక్షుల పేరు, స్కూల్ కోడ్, స్కూల్ పేరును ఈ జాబితాలో పేర్కొన్నారు.
ఆయా ప్రైవేటు పాఠశాలల్లో సీట్లు పొందిన విద్యార్థులు తమ ధ్రువీకరణ పత్రాలతో సంబంధిత పాఠశాలలకు వెళ్లి, జూన్ 7 లోపు ప్రవేశాలు నిర్ధారించుకోవాలని శ్రీనివాసరావు సూచించారు. రెండో విడత ఫలితాలను జూన్ 11న విడుదల చేస్తామన్నారు. రెండో విడతలో సీట్లు సాధించిన విద్యార్థుల ప్రవేశాల నిర్ధారణ జూన్ 18న ఖరారు చేస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు టోల్ ఫ్రీ నంబరు 180 042 585 99లో సంప్రదింవచ్చని తెలిపారు.
Leave A Comment