పాక్లో భూకంపం అలజడి.. 216 మంది ఖైదీల పరార్
పాక్లో భూకంపం అలజడి..
216 మంది ఖైదీల పరార్
కరాచి:
పాకిస్థాన్ లోని ఒక జైలు నుంచి 200 మందికి పైగా ఖైదీలు పరారయ్యారు. సోమవారం ఆ ప్రాంతంలో భూకంపం రావడంతో అక్కడ ఉన్న ఓ గోడ కూలిపోయింది. దీన్ని అదునుగా భావించిన ఖైదీలు జైలు నుంచి తప్పించుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
కరాచీలోని బఛా జైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం ఇక్కడ మూడుసార్లు స్వల్పంగా భూ ప్రకంపనలు సంభవించాయి. దీని కారణంగా జైలులోని కొన్ని గోడలకు పగుళ్లు రాగా.. మరికొన్ని కుప్పకూలాయి. దీంతో 600 నుంచి వెయ్యి మందికి పైగా ఖైదీలను వారి బ్యారక్ల నుంచి వేరేచోటుకి అధికారులు తరలించారు. ఈక్రమంలోనే అధికారుల కళ్లుకప్పి ఖైదీలు తప్పించుకున్నారు. ఆ సమయంలో పలువురు ఖైదీలు అక్కడి అధికారుల వద్ద ఉన్న ఆయుధాలు లాక్కుని వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక ఖైదీ మరణించగా.. నలుగురు అధికారులు గాయపడ్డారు.
ఖైదీల పరారీ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఖైదీలను తిరిగి పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. జాతీయ రహదారితో సహా పలు మార్గాలను మూసివేశారు. వారిని పట్టుకునేందుకు స్థానికుల సాయం తీసుకుంటున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఈనేపథ్యంలో 80 మందిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. కాగా.. ఈ జైలులో మాదకద్రవ్యాల సంబంధిత కేసుల్లోని నేరస్థులు పెద్దసంఖ్యలో ఉన్నారని మరో అధికారి వెల్లడించారు. పారిపోయిన వారిలో డ్రగ్స్ నేరస్థులు, మానసికంగా సరిగా లేనివారే ఎక్కువగా ఉన్నారన్నారు.
Leave A Comment