నాడు పటేల్ మాటలు విని ఉంటే ఉగ్ర భూతం ఉండేది కాదు
నాడు పటేల్ మాటలు విని ఉంటే
ఉగ్ర భూతం ఉండేది కాదు
- ప్రధాని మోదీ
గుజరాత్: దేశ తొలి కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ మాటలు విని ఉంటే.. భారత్లో ఉగ్రదాడుల పరంపర ఉండేది కాదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్కు వెళ్లిన ఆయన.. మంగళవారం పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్థాన్ ఉగ్రదాడులతో భారత్లో అలజడి సృష్టించాలని చూస్తే మౌనంగా ఉండబోమని హెచ్చరించారు.
‘ఉగ్రవాదాన్ని పాక్ ఒక యుద్ధ వ్యూహంగా అనుసరిస్తోంది. దీన్ని భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. పాక్లో ఉగ్రవాదుల అంత్యక్రియలకు ప్రభుత్వ అధికారులు హాజరయ్యి, ప్రభుత్వ లాంఛనాలతో జరిపించారు. ఆ దేశ ఆర్మీ కూడా వారికి సెల్యూట్ చేసింది. ఉగ్రవాదం అనేది పరోక్ష యుద్ధం కాదని.. పాకిస్థాన్ యుద్ధ వ్యూహమని ఇది రుజువు చేస్తోంది. దానికి తగినట్లే స్పందిస్తాం. భారత్ ఎవరితోనూ యుద్ధం కోరుకోవట్లేదు. మేము శాంతంగా ఉండటంతో పాటు ఇతరులు అలాగే ఉండాలనుకుంటాం. కానీ, పరోక్ష యుద్ధంతో మా బలాన్ని పరీక్షిస్తే.. సహించేది లేదు’ అని మోదీ పేర్కొన్నారు.
నాడు పటేల్ మాట విని ఉంటే..
1947 నాటి భారత విభజన గురించి మోదీ సభలో ప్రస్తావించారు. ‘1947లో భారత్ రెండు ముక్కలైంది. అదేరోజు రాత్రి కశ్మీర్లో తొలిసారి ఉగ్రదాడి జరిగింది. సాయుధ మూకల సాయంతో కశ్మీర్లోని కొంత భాగాన్ని పాక్ ఆక్రమించుకుంది. ఆ రోజున ఉగ్రవాదులను ఏరివేసి, ఆక్రమిత కశ్మీర్ను తిరిగి స్వాధీనం చేసుకోవాలన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ సలహా విని ఉంటే.. భారత్లో ఉగ్రదాడుల పరంపర కనిపించేది కాదు.కానీ అప్పటి ప్రభుత్వ పెద్దలు ఆ మాటవినలేదు. అప్పటి నుంచి పర్యాటకులు, యాత్రికులు, పౌరుల లక్ష్యంగా ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయి. పహల్గాంలో జరిగింది కూడా అందుకు ఉదాహరణ’ అని మోదీ వెల్లడించారు.
Leave A Comment