50,541 దరఖాస్తులు... 4,400 సీట్లు
నేడు ప్రవేశాల జాబితా విడుదల
వేంపల్లె, రాజీవ్గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ఐటీ ప్రాంగణాలకు 2025-26 విద్యా సంవత్సరం సంబంధించి ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ కోర్సు ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థుల జాబితా సోమవారం విడుదల కానుంది. ఈ మేరకు సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర విద్యాశాఖమంత్రి నారా లోకేశ్, లేదా ఆయన కార్యాలయ అధికారులు జాబితా విడుదల చేయనున్నారు.
సీటు దక్కితే అదే భాగ్యం
రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీలలో ఈడబ్ల్యూఎస్ కోటాతో కలిపి ఒక్కో దానిలో 1100.. మొత్తం నాలుగింటిలో 4,400 సీట్లు ఉన్నాయి. 10వ తరగతి మార్కుల ఆధారంగా ఇక్కడ ప్రవేశాలు కల్పించనున్నారు.. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివిన విద్యార్థులకు సీట్ల కేటాయింపులో 4 శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు. నాలుగు ట్రిపుల్ ఐటీలలో ప్రవేశాల కోసం తెలుగు రాష్ట్రాలకు చెందిన 50,541 మంది పోటీ పడుతున్నారు. వీరిలో 28,309 మంది బాలికలు, 22,232 మంది బాలురు ఉన్నారు.
ఒక్కో సీటుకు 12 మంది చొప్పున పోటీ పడుతున్నారు. వీరి భవితవ్యం సోమవారం తేలనుంది. నాలుగు ట్రిపుల్ఐటీలకు ఎంపికైన విద్యార్థుల జాబితాను వర్సిటీ అధికారిక వెబ్సైట్ ww.rgukt.in లో ఉంచుతామని రిజిస్ట్రార్, ప్రవేశాల విభాగాల కన్వీనర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ తెలిపారు. ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థులందరికీ ఈ నెల 30, జులై 1, 2, 3, 4, 5 తేదీల్లో ఇడుపులపాయ, నూజివీడు ట్రిపుల్ ఐటీలలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత జులై 14న ఆయా ట్రిపుల్ఐటీలలో తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
Leave A Comment