జులై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
జులై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడి
డిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆపరేషన్ సిందూర్పై సమావేశాల కోసం విపక్షాలు పట్టుపడుతున్న వేళ ఈ ప్రకటన వెలువడింది.
జులై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు బుధవారం ప్రకటించారు. ఆ రోజు ఉదయం 11లకు రాజ్యసభ, లోక్సభ సమావేశమవుతాయని వెల్లడించారు. ఈ సమావేశ తేదీలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంట్ వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు.
ఓ పక్క విపక్షాలు ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఉగ్రదాడిపై పార్లమెంట్ను ప్రత్యేకంగా సమావేశ పర్చాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రిజిజు స్పందిస్తూ.. వర్షాకాల సమావేశాల్లో అన్ని అంశాలను పార్లమెంట్ నిబంధనల ప్రకారం చర్చిస్తామని చెప్పారు.
ఇక ఆపరేషన్ సిందూర్ తదితర అంశాలపై చర్చించేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని మంగళవారం ఇండియా కూటమికి చెందిన 16 ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశాయి. దీనిపై దిల్లీలో జరిగిన కూటమి సమావేశంలో కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, దీపేందర్ హుడా, తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఓబ్రియెన్, రాష్ట్రీయ జనతాదళ్ నేత మనోజ్ ఝా, సమాజ్వాదీ పార్టీకి చెందిన రామ్గోపాల్ యాదవ్, శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ సహా పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఈ సమావేశంలో పాల్గొనకపోయినా ప్రత్యేక సమావేశం కోసం ప్రధానికి విడిగా లేఖ రాయనున్నట్లు వెల్లడించింది. బడ్జెట్ సమావేశాలు ఈ ఏడాది జనవరి 31న మొదలై.. ఏప్రిల్ 4న ముగిసిన విషయం తెలిసిందే.
Leave A Comment