విజయవాడ: స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం, కార్మికుల ప్రయోజనాల కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం అని ఏపీపీసీసీ వైఎస్ షర్మిల ప్రకటించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి కాంగ్రెస్ పార్టీ తరఫున అల్టిమేటం జారీ చేశారు. ఈ నెల 20 లోగా తొలగించిన 2 వేల మంది కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఈ నెల 21 నుంచి స్టీల్ ప్లాంట్ ఎదుటే ఆమరణ దీక్ష చేపడతామని హెచ్చరించారు. విశాఖ ఉక్కు యాజమాన్యానిది నిరంకుశ ధోరణి అని అన్నారు. డిమాండ్ల సాధన పై రేపటి నుంచి కార్మికులు సమ్మె బాట పడుతుంటే కనీసం దిద్దుబాటు చర్యలకు దిక్కులేదు అని పేర్కొన్నారు.
కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్న కనికరం లేదన్నారు. ఇప్పటికే యాజమాన్యం 2 వేల మంది కాంట్రాక్టు కార్మికుల పొట్ట కొట్టిందని ఆరోపించారు. మరో 3వేల మందిని రోడ్డున పడేసేందుకు కుట్రలు చేయడం దుర్మార్గం అన్నారు. అన్యాయాన్ని ప్రశ్నించిన కార్మికులను సైతం ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేయడం దారుణం అని పేర్కొన్నారు. రెగ్యులర్ ఉద్యోగులకు 8 నెలలుగా పెండిరగ్ లో ఉన్న వేతనాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. 2021 జనవరిలో తీసుకున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించాలని కోరారు.
Leave A Comment