• Login / Register
  • ఆంధ్ర ప్రదేశ్

    రైతాంగ సమస్యలపై క్యాబినెట్‌ సబ్‌ కమిటీ

    రైతాంగ సమస్యలపై క్యాబినెట్‌ సబ్‌ కమిటీ 

    ఏపీఐఐసీకి 615 ఎకరాల కేటాయింపు
     2,260 స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్ల నియామకానికి ఆమోదం  
     ఏపీ మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు
      మద్యం స్కామ్‌పై పారదర్శకంగా విచారణ: సీఎం

    అమరావతి, విశాఖ సమాచారం: వ్యవసాయ దిగుబడులు, గిట్టుబాటు ధరలు, నిత్యావసరాల ధరలపై ఆరుగురు మంత్రులతో క్యాబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు గిట్టుబాటు ధర దక్కేందుకు తీసుకోవా ల్సిన చర్యలపై క్యాబినెట్‌ సబ్‌ కమిటీ నిరంతర పర్యవేక్షణ చేస్తుంది.  ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన   ఏపీ క్యాబినెట్‌ సమావేశంలో రైతాంగ సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది వివిధ పంటల దిగుబడులు పెరిగాయని అధికారులు వివరించారు. అంతర్జాతీయ పరిణామాలు, దేశవిదేశాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా వివిధ పంటల ధరలపై ప్రభావం ఉందన్నారు. మిర్చి, పొగాకు, ఆక్వా, కోకో, చెరుకు, మామిడి వంటి పంట ఉత్పత్తుల ధరలు తగ్గడానికి గల కారణాలు వివరించారు. రైతుల్ని ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వ్యవసాయ దిగుబడులు, గిట్టుబాటు ధరలు, నిత్యావసరాల ధరలపై ఆరుగురు మంత్రులతో క్యాబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. క్యాబినెట్‌ సమావేశంలో 45 నిమిషాలు వ్యవసాయరంగం, అన్నదాతల కష్టాలు, మార్కెటింగ్‌పై చర్చ జరిగింది. రైతులకు స్వాంతన చేకూరేలా, క్షేత్ర స్థాయిలో ఫలితాలు కనిపించేలా ప్రభుత్వ చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

    పరిశ్రమలకు భూములు
     ముత్తుకూరులో ఏపీఐఐసీకి 615 ఎకరాలు కేటాయించేందుకు కేబినెట్‌ అనుమతిచ్చింది. ఇక్కడ పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. తాడిమర్రిలో అదానీ పవర్‌కు 500 మెగావాట్లు, కొండాపురంలో 1000 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టులకు భూ కేటాయింపునకు ఆమోదం తెలిపింది. ఎకరానికి రూ.5 లక్షల చొప్పున భూమి కేటాయించాలని కేబినెట్‌ నిర్ణయించింది.  కాగా, మంత్రివర్గ అజెండాలోని అంశాల తర్వాత తాజా పరిణామాలపై చంద్రబాబు చర్చించారు. మద్యం స్కామ్‌పై విచారణ పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు. ఎవరూ తొందరపడి మాట్లాడి అనవసర వివాదాలను తావివ్వొద్దని మంత్రులకు సూచించారు. ప్రధాని ఆధ్వర్యంలో జరిగే యోగా డేను విజయవంతం చేయాలన్నారు.

    కేబినెట్‌లో ప్రధాన నిర్ణయాలు 
       ` 2,260 స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్ల నియామకానికి కేబినెట్‌ ఆమోదం    
      `  హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీని ఏపీకి తరలించే ప్రతిపాదనకు ఆమోదం
      `  విద్యార్థులకు కోచింగ్‌ ఇచ్చేందుకు స్టడీసెంటర్ల ఏర్పాటుకు అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీకి అనుమతి
       ` అమరావతి బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా లీగల్‌ వర్సిటీ ఏర్పాటుకు ఆమోదం
      `  దుకాణాల ద్వారా రేషన్‌, ఇతర సరకులు ఇచ్చే ప్రతిపాదనపై కేబినెట్‌లో చర్చ
     `   భోగాపురం వద్ద 500 ఎకరాలు కేటాయించే మంత్రుల బృందం ప్రతిపాదనకు ఆమోదం
     `   ఏపీ లెదర్‌ ఫుట్‌వేర్‌ పాలసీ 4.0కి కేబినెట్‌ ఆమోదం
     `   పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఆమోదించిన 11 సంస్థలకు కేబినెట్‌ ఆమోదం
      `  రూ.30 వేల కోట్ల పెట్టుబడులు, 35 వేల ఉద్యోగాల కల్పనకు కేబినెట్‌ ఆమోదం.

    Leave A Comment