యోగాకు గుర్తింపు తెచ్చిన వ్యక్తి ప్రధాని మోదీ
యోగాకు గుర్తింపు తెచ్చిన వ్యక్తి ప్రధాని మోదీ
- సీఎం చంద్రబాబు
- యోగాంధ్ర’ వెబ్సైట్ ప్రారంభం
అమరావతి, విశాఖ సమాచారం: యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఉండవల్లిలో బుధవారం ‘యోగాంధ్ర’ వెబ్సైట్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచంలో అన్ని దేశాల్లో నిర్వహించుకునే కార్యక్రమం యోగా అన్నారు. ఇది కొద్ది మందికో, కొన్ని ప్రాంతాలకో పరిమితమైంది కాదని.. ప్రపంచానికి భారత్ అందిస్తున్న గొప్ప వరమని పేర్కొన్నారు. అందరి జీవితాల్లో యోగా భాగం కావాలన్నారు. ఒత్తిడి నుంచి ఉపశమనం కావాలంటే దీన్ని సాధన చేయాలని సూచించారు.
‘‘ఫొటోలు, ఈవెంట్ కోసం ఒకరోజు చేసే కార్యక్రమం కాదిది. ప్రతిఒక్కరిలో ప్రగాఢమైన మార్పు తీసుకొచ్చే కార్యక్రమమిది. జీవనశైలిలో భాగమయ్యేలా యోగాను ముందుకు తీసుకెళ్లాలి. నేటి నుంచి నెలపాటు యోగాంధ్ర-2025 నిర్వహిస్తున్నాం. కనీసం 2 కోట్ల మందికి తక్కువ కాకుండా పాల్గొనాలన్నది సంకల్పం. కనీసం 10 లక్షల మందికిపైగా యోగా సర్టిఫికెట్లు ఇవ్వాలనేది లక్ష్యం. జూన్ 21న విశాఖలో 5 లక్షల మందితో ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు కార్యక్రమం చేపడతాం. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు కార్యక్రమం నిర్వహిద్దాం. విశాఖలో జరిగే యోగా ఈవెంట్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. పాఠశాలల్లోనూ ఇక నుంచి రోజూ ఒక గంట యోగా ఉంటుంది’’ అని చంద్రబాబు తెలిపారు.
Leave A Comment