• Login / Register
  • ఆంధ్ర ప్రదేశ్

    తెలుగువారి ఆత్మగౌరవ శిఖరం ఎన్టీఆర్‌

    తెలుగువారి ఆత్మగౌరవ శిఖరం ఎన్టీఆర్‌

     టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు
    రెండో రోజు మహానాడు వేదికపై  తారక రామారావుకు ఘన నివాళి
    పార్టీలో కొందరు కోవర్టులున్నారు జాగ్రత్త అంటూ హెచ్చరిక
     కార్యకర్తే సుప్రీం.. ఇదే టీడీపీ సిద్ధాంతం అంటూ శ్రేణులకు భరోసా
     
    కడప, విశాఖ సమాచారం: ఎన్టీఆర్‌ యుగ పురుషుడని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొనియాడారు. నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని మహానాడు ప్రాంగణంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం సభలో ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్‌ అమర్‌ రహే అంటే.. రీసౌండ్‌ రావాలి.. మీ నియోజకవర్గాల్లో వినిపించాలి అని కార్యకర్తలకు సూచించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవ శిఖరం.. తెలుగు సినీ రాజకీయ సార్వభౌముడు, తెలుగు జాతి మొత్తం అభిమానించే ఆరాధించే ఏకైక నాయకుడు నందమూరి తారకరామారావు అన్నారు. ఎన్టీఆర్‌ జయంతి తెలుగుజాతి పండుగ రోజు అని పేర్కొన్నారు. ఒకే వ్యక్తి రెండు రంగాల్లో రాణించడం ఎక్కడా లేదన్నారు. ఆయన జీవితంలో ఎన్నో మజిలీలు.. మలుపులు ఉన్నాయన్నారు. తెలుగు సినీ పరిశ్రమంలో ఎవరెస్టు లాగా ఎదిగారని, , అదే విధంగా రాజకీయాల్లో రాణించారని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ జీవితం పూల పాన్పు కాదన్నారు.
    స్వీయ క్రమశిక్షణ, నీతి నిజాయితీ, పట్టుదల ఆయన ఆయుధాలన్నారు. ఆత్మాభిమానాన్ని ఎప్పుడు వీడని నాయకుడు అని కొనియాడారు. ఎన్టీఆర్‌ పేరు తలచుకుంటే నరాల్లో ఉత్తేజం, ఆత్మ విశ్వాసం, పట్టుదల వస్తుందని తెలిపారు. ఎన్టీఆర్‌ రూపాన్ని చూసి ఏ సంకల్పాన్ని చేసినా అది సాధిస్తారని చంద్రబాబు తెలిపారు. ఆయన చైతన్య రథంపై ప్రసంగిస్తుంటే ఆకాశం గర్జిస్తున్నట్లు ఉంటుందన్నారు. అన్ని వర్గాలు కీర్తించే నాయకుడు ఎన్టీఆర్‌ అని అన్నారు. ఎంత కష్టమైనా వెనకడుగు వేయలేదన్నారు. రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన వ్యక్తి ఆయన అని తెలిపారు. సమాజమే దేవాలయం., ప్రజలే దేవుళ్లు అనేది పార్టీ సిద్ధాంతం అని అన్నారు. ఎన్టీఆర్‌ రూపొందించిన జెండా శాశ్వతంగా ఉంటుందన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన జెండా తెలుగుదేశం పార్టీ జెండా అని తెలిపారు. తెలుగు ప్రజల నమ్మకం, విశ్వాసం, భరోసా.. తెలుగుదేశం జెండా అని అన్నారు. ఆ జెండా ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి సుపరిపాలనతో కొత్త పాలనను తీసుకు వచ్చారని అన్నారు. రాష్ట్రంలో కరువు వచ్చినప్పుడు, దివిసీమ ఉప్పెన వచ్చినపుడు ఆయన ప్రజలకు ఎంతో సేవ చేశారని గుర్తుచేశారు.

    కోవర్టులారా ఖబర్దార్‌..  
     
     కరుడుగట్టిన నేరస్తులతో రాజకీయాలు చేస్తున్నామని సీఎం   వ్యాఖ్యానించారు. మహానాడు వేదిక నుంచి ఆయన రెండోరోజు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసగించారు.   వివేకానంద రెడ్డి హత్య కేసులో నాలాంటి నాయకుడినే మోసం చేయగలిగారనిన్నారు. గుండెపోటుతో వివేకా చనిపోయారంటూ ప్రచారం చేశారని.. అందరిలా తాను కూడా నమ్మానని అన్నారు.  ఎన్నికల బిజీలో ఉండి తాను కూడా ఆలోచించ లేదని.. మళ్లీ అసలు విషయం సాయంత్రానికి తెలిసిందన్నారు.  అలాంటి నేరస్తులతో రాజకీయం చేస్తున్నామని చంద్రబాబు అన్నారు.
    ‘సంతనూతపాడులో వీరయ్యచౌదరి, పల్నాడులో జంట హత్యలు జరిగితే తనకు అనుమానం వచ్చిందని అన్నారు. ఇప్పుడు నేను ఎవరినీ నమ్మడం లేదని.. ప్రతి ఒక్క విషయాన్ని వేరే విధంగా ఆలోచిస్తున్నానని తెలిపారు. కొంతమంది మన దగ్గర ఉండి వారికి కోవర్టులుగా పనిచేస్తూ వాళ్ల ప్రోత్సాహంతో ఇష్టానుసారంగా హత్యా రాజకీయాలు చేస్తున్నారు. మన వేలితో.. మన కంట్లోనే పొడుచుకునేలా చేస్తున్నారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్లు తమ వాళ్లను చంపుతున్నారంటూ చెడ్డపేరు తెస్తున్నారని అన్నారు. ఎవరైనా మన కార్యకర్తలు ఇలాంటి తప్పుడు పనిచేస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని అన్నారు. నేరస్తులు ఖబడ్దార్‌.. నా వద్ద మీ ఆటలు సాగనివ్వనంటూ మాస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఇది నా హెచ్చరిక.. కోవర్టులను తమ వద్దకు పంపి.. వారి ద్వారా అజెండాను నెరవేర్చుకోవాలనుకుంటే ఆ విషయాలను కూడా ఇక నుంచి పసిగడతామని అన్నారు. కోవర్టుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. వలస పక్షలు వస్తాయి పోతాయి.. కానీ నిజమైన కార్యకర్త శాశ్వతంగా ఉంటారని తెలిపారు. పార్టీ బలోపేతం కావాలి.. అదే సమయంలో కోవర్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు సూచించారు.


    కార్యకర్తే సుప్రీం.. ఇదే టీడీపీ సిద్ధాంతం

     పాత తరం విలువలు, కొత్త తరం ఆలోచనలు ఈ రెండు కలిపి ఆరుశాసనాలు రూపొందించామని తెలిపారు. ఈ శాసనాల ద్వారా తెలుగు ప్రజలను 2047 నాటికి ప్రపంచంలో నెంబర్‌వన్‌గా నిలపాలని తన ధృఢసంకల్పం అన్నారు. మళ్లీ జన్మంటే తెలుగు జాతి కోసం తెలుగు గడ్డపైనే పుడతా అన్నారు. కార్యకర్తలే అధినేత, కార్యకర్తలే సుప్రీం ఇది.. పార్టీ సిద్ధాంతం అన్నారు. 45 రోజుల్లో కోటికి పైగా సభ్యత నమోదు చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని తెలిపారు. తొలిసారి అసెంబ్లీకి 65 మంది యువతకు సీట్లు ఇచ్చిన చరిత్ర టీడీపీదన్నారు. రాబోయే 40 ఏళ్లకు రోడ్‌మ్యాప్‌నకు రూపకల్పన చేసుకున్నామని తెలిపారు. ఇన్నేళ్లు తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతూ ఉందంటే దానికి కారణం పార్టీ కార్యకర్తలేనని పేర్కొన్నారు. భవిష్యత్తులో మీ సంక్షేమం సాధికారత కోసం పనిచేస్తానని అన్నారు. పార్టీ అందరికీ అండగా ఉంటుందన్నారు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా తెలుగుదేశం పార్టీ గెలవాలని.. ప్రజలు మెచ్చే రాజకీయ పాలన చేస్తామని   తెలిపారు.

    Leave A Comment