ఏపీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు - మంత్రి నారా లోకేశ్
విశాఖ సమాచారం: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని మంత్రి నారా లోకేశ్ అన్నారు. వివిధ సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు సీఎం చంద్రబాబు బ్రాండే కారణమని చెప్పారు. అనంతపురం జిల్లా గుత్తి మండల బేతపల్లిలో రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్కు మంత్రి లోకేశ్ శుక్రవారం భూమిపూజ చేశారు. 2,300 ఎకరాల్లో రూ.22వేల కోట్లతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. భూమిపూజ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లోకేశ్ మాట్లాడారు.
రాయలసీమలో రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్ ఏర్పాటుతో 10వేల మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటామని లోకేశ్ చెప్పారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. మన నేలపై ఉత్పత్తయ్యే విద్యుత్ రాష్ట్రానికే కాకుండా.. దేశ అవసరాలకు కూడా ఉపయోగపడనుందని తెలిపారు. ఇలాంటి ప్రాజెక్టులతో విద్యుత్ ఛార్జీలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. త్వరలోనే కర్నూలుకు హైకోర్టు బెంచ్ తీసుకొస్తామని ఈ సందర్భంగా లోకేశ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం రోడ్లపై గుంతలనూ పూడ్చలేకపోయిందని విమర్శించారు. ఒక్క పెట్టుబడి కూడా తీసుకురాలేకపోయారన్నారు. ప్రస్తుతం టాటా ఎనర్జీ, టీసీఎస్ సహా అనేక సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని లోకేశ్ వివరించారు. డీఎస్సీ ద్వారా 16వేల టీచర్ పోస్టులను వచ్చే నెలలో భర్తీ చేస్తామన్నారు.
Leave A Comment