ఏపీకి ఆరు కుంకీ ఏనుగులు అప్పగించిన కర్ణాటక
ఏపీకి ఆరు కుంకీ ఏనుగులు అప్పగించిన కర్ణాటక
బెంగళూరు: ఏపీకి ఆరు కుంకీ ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం అప్పగించింది. బెంగళూరులోని విధానసౌధలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. కుంకీ ఏనుగుల అప్పగింత, వాటి సంరక్షణకు సంబంధించిన డాక్యుమెంట్లను పవన్కు సిద్ధరామయ్య అందజేశారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ కుంకీ ఏనుగులు ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి, సీఎం సిద్ధరామయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి సాయం అడిగినా కర్ణాటక ప్రభుత్వం ముందుకొస్తోందన్నారు. ఏపీ, కర్ణాటక మధ్య సహకారం ఇలాగే కొనసాగాలని పవన్ ఆకాంక్షించారు. కుంకీ ఏనుగుల సంరక్షణకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. ఏపీ, కర్ణాటక మధ్య 9 ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. పంటపొలాల్ని నాశనం చేస్తున్న అడవి ఏనుగులను నియంత్రించేందుకు కుంకీ ఏనుగులను రంగంలోకి దించుతారు.
కుంకీ ఏనుగులు ఏం చేస్తాయ్?
కుంకీలు పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన ఏనుగులు. ఎక్కడైనా ఏనుగుల గుంపు దాడికి దిగినప్పుడు కుంకీలను రంగంలోకి దింపుతారు. ఏనుగులను తరిమికొట్టడంలో ఇవి కీలక భూమిక పోషిస్తాయి. కొన్నిసార్లు గాయపడిన లేదా చిక్కుకున్న అడవి ఏనుగును రక్షించడానికీ వీటిని ఉపయోగిస్తారు. సాధారణంగా కుంకీ ఏనుగులుగా మగవాటినే ఎంపిక చేసుకుంటారు. ఎందుకంటే ఇవి మాత్రమే ఒంటరిగా సంచరిస్తుంటాయి. వీటిని బంధించి కొన్ని నెలల పాటు శిక్షణ ఇస్తారు. తర్వాత ఆపరేషన్ల కోసం వాడుతుంటారు. ఏనుగుల గుంపును అడవిలోకి తిరిగి పంపించేంత వరకు ఇవి విశ్రమించవు. కొన్నిసార్లు పంట పొలాలపైకి వచ్చిన ఏనుగులతో ఇవి తలపడాల్సి ఉంటుంది కూడా. అందుకే పోరాడడంలోనూ వీటికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
Leave A Comment